10, నవంబర్ 2012, శనివారం

సీతారాముల మంగళాశాసనం

రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం

సీతారాములు వారి కల్యాణ సమయంలో ఒకరిపై ఒకరు తలబ్రాలు పోసుకునే ఘట్టాన్ని బహుచమత్కార భరితంగా వర్ణించిన ఈ క్రింది శ్లోకాన్ని మన తెలుగువారు చాలామంది పెండ్లి పిలుపు పత్రికలపైన తెలుగు లిపిలో ముద్రింపించి తద్వారా తమ ఇంటి వధూవరులకు ఆ పురాణ దంపతుల మంగళాశాసనం పొందడం ఒక ఆచారంగా వస్తున్నది. ఐతే  సంస్కృతభాష పరిచయం లేని కారణంగా పెండ్లిపత్రిక  అందుకున్నవారిలో కొంతమంది ఈ శ్లోకాన్ని చదివినా, దానిలోని అందచందాలను ఆస్వాదించే సావకాశం తక్కువగానే వుంటుంది.

సంస్కృతభాష నేర్వని తెలుగు వారికి ఈ శ్లోకంలో పాదపాదానికి ఎదురయ్యే చమత్కారాలను దృష్టికి తెచ్చే ఆశయంతో, దీనిని తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసి పాఠకుల ముందుంచుతున్నాను. అంతేగాక ఈ "మంజరీ ద్విపద" ఛందస్సులో సాగిన ఈ గీతిక పాడుకొనుటకూ,  పెండ్లి పత్రికలలో ముద్రించుకొనుటకూ ఉపయోగ పడునని నా అభిప్రాయం. దీనిని చదివి ఆనందించుడని "సుజన రంజని" పాఠకులకు మనవి.

శ్లో||     జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయితాః
         న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాః
         స్రస్తాశ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః
         ముక్తాస్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః 

పై శ్లోకానికి స్వేచ్ఛానువాదం

మంజరీ ద్విపద:       

శ్రీరాము నానాడు సీతమ్మ తల్లి
ఆనందముగ పెండ్లి ఆడేటి వేళ, 
తలబ్రాలు పోయంగ తనరి దోసిటను
తెల్లన్ని ముత్యాలు తీపార గొనగ,
ఎఱుపు తామరలట్టి అఱచేతులందు
ముదముతో జనులెల్ల ముగ్థులై చూడ,
ముత్యాలు యెఱ్ఱనై  మురిపాలు జిమ్మె,
కెంపులై దానిమ్మ గింజలో యనగ -

సిగ్గుతో తలవంచి సీతమ్మ తలరి, 
తలబ్రాలు రామయ్య తలపైన బోయ,
నిజవర్ణ భరితమై నెగడి ముత్యాలు
తెల్లగా కనుపట్టె మల్లెలో యనగ -

నీలమేఘము వోలె నెనయు రాఘవుని
మేనిపై ముత్యాలు మెండుగా దొర్లి
ఇంద్రనీలాలట్లు ఇంపుగా మెఱసె
నిండార పండిన నేరేళ్ళ వలెను -

ఇన్నిరంగులు చూచి ఇంతి యుప్పొంగె,
చిన్నగా నవ్వాడు శ్రీరాము డపుడు -  
ఆరీతి రంజిల్లు అపురూప యుగళి,
దీవించుగాక మా వధూవరుల.


సిలికానాంధ్ర వారి June, 2012 సుజనరంజని e-magazine కవితా స్రవంతి శీర్షికలొ ప్రచురితము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి